హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న 100మంది కలెక్టర్లలో తెలంగాణ నుంచి ముగ్గురు నిలిచారు. ప్రఖ్యాత రేటింగ్ పత్రిక ఫేమ్ ఇండియా నిర్వహించిన సర్వే జాబితాను ‘బెస్ట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ 2026’ పేరిట తాజాగా ప్రకటించింది. అందులో దాసరి హరిచందన(హైదరాబాద్), నారాయణరెడ్డి(రంగారెడ్డి), మిక్కిలినేని మను చౌదరి(మేడ్చల్ మల్కాజిగిరి) ఎంపిక కావడం రాష్ర్టానికి గర్వకారణం. ఇక ఏపీ నుంచి గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా, కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జీ లక్ష్మీష్ ఉన్నారు. మొత్తంగా ఈ 100మంది జాబితాలో 22 రాష్ర్టాల కలెక్టర్లతో పాటు, అరుణాచల్ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు ఉన్నారు.
ఫేమ్ ఇండియా మ్యాగజైన్ 2011 నుంచి ఈ విధమైన సర్వేలు నిర్వహిస్తున్నది. 2026 సంవత్సరానికి గాను ఫేమ్ ఇండియా మ్యాగజైన్ ఏషియా పోస్ట్ ఏజెన్సీ సహకారంతో సర్వే చేసింది. దేశవ్యాప్తంగా 800 జిల్లాల్లోని కలెక్టర్ల పనితీరును 10 అంశాల ఆధారంగా పరిశీలించింది. కలెక్టర్ల పనితీరు, విశిష్ట సేవలను నిర్ణయించేందుకు ప్రజాభిప్రాయం సేకరించడంతో పాటు, అధికార, ప్రతిపక్ష నాయకుల వరకు ప్రజాప్రతినిధులు అభిప్రాయాలను తీసుకున్నట్టు పత్రిక తెలిపింది. అత్యంత విశిష్టత కలిగిన 25మంది కలెక్టర్ల జాబితాను రాబోయే సంచికలో ప్రచురించనున్నట్టు పత్రిక తెలిపింది. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న కలెక్టర్లను గుర్తించి గౌరవించడమే లక్ష్యంగా సర్వే నిర్వహించినట్టు వెల్లడించింది.