భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 3 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా భార్య ములుగు జిల్లా అదనపు కలెక్టర్ త్రిపాఠి ప్రసవం కోసం చేరారు. దాంతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. జిల్లా కలెక్టర్గా భవేశ్మిశ్రా బాధ్యతలు చేపట్టాక జిల్లా వైద్య అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ దవాఖానలో అన్ని రకాల వైద్యసదుపాయాలను కల్పించారు.
ఈ క్రమంలో కలెక్టరే స్వయంగా తన భార్యను ప్రభుత్వ దవాఖానలో డెలివరీ కోసం అడ్మిట్ చేయించి జిల్లా ప్రజలకు ప్రభుత్వ దవాఖానాలపై నమ్మకం కలిగించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అన్ని రకాల వసతులతో జిల్లాకేంద్రంలో 100 పడకల దవాఖానను అందుబాటులోకి తెచ్చింది.