నల్లగొండ : ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మనదే అని, కుల, మత, లింగభేదం తేడా లేకుండా రాజ్యాంగం అందరికీ సమానంగా ఓటు హక్కును(Vote) కల్పించిందని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన (Collector Harichandana) అన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకున్ని ఎన్నుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్నారు. పలాన వారికి వేయాలని ఎవరో చెప్తే మీరు ఓటు వేయొద్దని, మీ ఆత్మ సాక్షిగా నైతిక ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.
మంగళవారం ఆమె ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా నల్లగొండ పట్టణంలో నైతిక ఓటింగ్ పై నాగార్జున కళాశాల మైదానం నుంచి స్థానిక గడియారం సెంటర్ వరకు నిర్వహించిన 5 కే రన్ను(5K run) జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె స్థానిక గడియారం సెంటర్లో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఈ ఎన్నికలలో 85 సంవత్సరాలు నిండిన ఓటర్లకు, దివ్యాంగ ఓటర్లకు హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించిందని తెలిపారు.
హోమ్ ఓటింగ్ వేయాలనుకునే ఓటర్లు ఫామ్- 12 డి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, లేదా సాక్ష్యం యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జెడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డాక్టర్ పుల్లారావు పాల్గొన్నారు.