Cold Weather | తెలంగాణలో రెండురోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో చలి తీవ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడ చలిగాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే మూడురోజులు అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రెండురోజుల పాటు పలుచోట్ల సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని చెప్పింది. రాబోయే కొద్దిరోజులు పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు నమోదవుతుండగా.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో 5 డిగ్రీలకు పడిపోతాయని పేర్కొంది.