హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీలో కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ‘ప్రజా సంగ్రామం’ యాత్ర సాక్షిగా గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ప్రారంభం సందర్భంగా గురువారం మీడియాకు ఇచ్చిన ప్రకటనల్లో బండి సంజయ్ తన వర్గం నాయకుల ఫొటోలనే అచ్చేయించారు. పార్టీలో తాము ఎంతో కీలకమని భావిస్తున్న ఎమ్మెల్యేలు రఘునందన్రావు, ఈటల రాజేందర్ ఫొటోలకు కత్తెరేశారు. దీంతో పార్టీలో వర్గపోరు రచ్చకెక్కినట్టయ్యిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తమ నాయకులను బండి సంజయ్ కావాలనే తొక్కేస్తున్నారని రఘునందన్, ఈటల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం లేని బీజేపీ నాయకులు.. ప్రజా సంగ్రామం అంటూ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టేందుకు బయలుదేరారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
పెరుగుతున్న దూరం
రాష్ట్ర బీజేపీ రెండు వర్గాలుగా చీలిందని కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను బండి యాత్ర నిజం చేయనున్నదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బండి సంజయ్కి ఎమ్మెల్యేలు రఘునందన్, ఈటలకు అస్సలు పొసగడం లేదని అంటున్నారు. వారు బహిరంగ వేదికలపైనే పరస్పరం విమర్శలకు దిగుతుండటం పార్టీ జాతీయ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. రాష్ట్ర పార్టీపై ఆధిపత్యం కోసం పోటీ తారస్థాయికి చేరిందని విశ్లేషకులు అంటున్నారు. తనకు పార్టీలో కనీస మర్యాద ఇవ్వడంలేదంటూ రఘునందన్రావు స్వరం పెంచారు. ‘పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న మమ్మల్ని ఇంత అవమానిస్తారా? రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ఆహ్వానించి కూడా వేదికపైకి ఎందుకు పిలవరు? ఇదేం పద్ధతి?’ అంటూ అధిష్ఠానానికి ధిక్కార స్వరం వినిపించారని సమాచారం. తొలి దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్లో జరిగినా స్థానిక ఎమ్మెల్యే రఘునందన్రావును మాట్లాడించకపోవడంపైనా ఇప్పుడు చర్చ జరుగుతున్నది.
బండి వర్సెస్ ఈటల
యాత్రల పేరుతో బండి సంజయ్ పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నారని బీజేపీ సీనియర్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉన్న నాయకులను తొక్కిపెట్టి వారికి ప్రత్యామ్నాయాలు వెతికే పనిలో బండి ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో బండికి అస్సలు పొసగటం లేదని తాజా పరిస్థితులు చూస్తే అర్థమవుతున్నది. ఒకప్పుడు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ను బీజేపీ రాష్ట్ర నాయకత్వం కనీసం సోదిలోకి కూడా తీసుకోవడం లేదన్న చర్చ జోరందుకొన్నది. సీనియారిటీ ఉండి కూడా మనం తగ్గడం ఎందుకంటూ ఈటల వర్గం బుసలు కొడుతుండగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కాబట్టి తన ఆదేశాలే చెల్లుబాటు కావాలని బండి సంజయ్ గరం అవుతున్నట్టు సమాచారం.
ఈటల రాజేందర్ తనకు చెప్పకుండా జిల్లా పర్యటనలు చేయడం ఏంటని బండి వర్గం, అసలు ఆయన చెప్పాల్సిన పనేంటని ఈటల వర్గం పోటాపోటీగా తలపడుతున్నట్టు పార్టీ కార్యకర్తలు చర్చించుకొంటున్నారు. ఈటలకు చెక్ పెట్టేందుకే ఆయన రాష్ట్ర యాత్రకు బండి సంజయ్ అడ్డుపుల్ల వేశారని ఈటల అభిమానులు మండిపడుతున్నారు. రెండుసార్లు ఎంపీగా పనిచేసి, బీజేపీలో జాతీయస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న జితేందర్రెడ్డి ఫొటో సైతం బండి యాత్ర ప్రకటనల్లో కనిపించకపోవడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆదివాసీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ సోయంబాపురావును పూర్తిగా కనుమరుగు చేశారంటూ ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.