సిద్దిపేట : సిద్దిపేట జిల్లా(Siddipet) మద్దూరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో బుధవారం ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేస్తున్న కూలీలకు(Employment Guarantee laborers) ఓ రాతి పాత్ర దొరికింది. దీంతో తొలుత రాతి పాత్రను ఓపెన్ చేసేందుకు కూలీలు భయపడ్డారు. కొంతమంది కూలీలు దానిని తెరిచి చూశారు. ఆ పాత్రలో పురాతన కాలం నాటి 25 వెండి నాణేలు, రెండు వెండి ఉంగరాలు లభ్యమయ్యాయి.
పురాతన నాణెములు దొరికిన విషయాన్ని గ్రామస్తులు బహిర్గతం చేయగా చేర్యాల సీఐ శ్రీను, మద్దూరు తహసీల్దార్ అనంతరెడ్డి, ఎంపీడీవో రామ్మోహన్ తదితర అధికారులు గ్రామానికి చేరుకొని, కూలీలకు దొరికిన నాణేలను పరిశీలించారు. ఇవి నిజాం కాలం నాటి నాణెములుగా(Nizam period Coins) భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నాణెములు, ఉంగరాలను పురావస్తు శాఖకు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు.