రామకృష్ణాపూర్, డిసెంబర్ 8: తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ దొంగ పాదయాత్రలు చేస్తూ అబద్ధాలు చెప్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలోని బీ జోన్ సెంటర్లో 273 మందికి గురువారం సింగరేణి ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి దేశంలో ఏ వర్గానికి ఇప్పటి వరకు న్యాయం చేయలేదని విమర్శించారు. 130 ఏండ్ల చరిత్ర కలిగి, లాభాల్లో ఉన్న సింగరేణిని ప్రైవేట్పరం చేసేందుకు ప్రధాని కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు.