కరీంనగర్ : రైతాంగానికి సహకార బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి. నష్టాల్లో నడిచిన సహకార బ్యాంకులు లాభాల బాట పట్టించేందుకు పాలకవర్గం చేసిన కృషి గణనీయమైందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ స్థాపించి శత వసంతాలు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం కరీంనగర్ పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహించిన ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ముందుగా పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నాబార్డ్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన, పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..1921 సమాచారంలో స్థాపించిన కేడీసీసీ బ్యాంక్ ఇరవై ఐదు సంవత్సరాల పాటు నష్టాల్లో నడిచినప్పటికి, 2005 సంవత్సరంలో బ్యాంకు పగ్గాలు చేపట్టిన రవీందర్ రావు బ్యాంకును వేల కోట్ల లాభాల బాటలో నడిపించడం అభినందనీయమని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 7 సంవత్సరాల కాలంలో రాష్ట్రం వ్యవసాయం, డైరీ, మత్స్య, పాడి పరిశ్రమలలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. అంచనాలకు మించి వరి ధాన్యం పండిందని, ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆన్నారు. నాబార్డ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి పరిష్కారం చూపాలని కోరారు. కేడీసీసీ బ్యాంక్ ఇదే స్ఫూర్తిని కొనసాగించి రైతులకు అండదండలు అందించాలని తెలిపారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పాలకవర్గం సిబ్బంది కృషి వల్లనే అభివృద్ధి పథంలో పయనిస్తుందని, రైతుల మన్ననలు అందుకుంటోందన్నారు. రైతుల ఆర్థిక వ్యవస్థలకు మూలాలైన నాబార్డ్, ఇఫ్కో, క్రిబ్ కో, నాఫెడ్ సంస్థల చైర్మన్లు కేడీసీసీబీ శత వసంతాల ఉత్సవాలకు హాజరు కావడం అభినందనీయమని అన్నారు.
సీఎం కేసీఆర్ కృషి వల్లనే కాలేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పడి పుష్కలంగా నీటితో కళకళలాడుతూ పంటలు పండుతున్నాయి అని అన్నారు. సహకార బ్యాంకులు వ్యక్తిగత పూచీకత్తుపై రుణాలు అందించాలని, తద్వారా యువత ఆర్థిక అభివృద్ధి సాధించే వీలు కలుగుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. సహకార బ్యాంకుల మిగితా బ్యాంకులకు దీటుగా మారాయని అన్నారు. రైతులకు అండగా నిలుస్తున్న బ్యాంకులలో సహకార బ్యాంకులు అగ్రగామి గా నిలుస్తున్నాయి ప్రశంసించారు.
నాబార్డ్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు మాట్లాడుతూ దేశానికి రాజైనా తల్లికి కొడుకే నని, తాను నాబార్డ్ చైర్మన్ అయినప్పటికీ తెలుగోడి నేనని అన్నారు. నా బార్డ్ కు వచ్చే ఆదాయంలో సింహ భాగం తెలుగు రాష్ట్రాల నుంచే వస్తుందని అన్నారు. వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి రైతులు విముక్తి పొందారంటే అందుకు కారణం సహకార బ్యాంకు లేనని అన్నారు.
అంతకు ముందు ఆయన కేడీసీసీ బ్యాంక్ ఆవరణలో శత వసంత ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆవిష్కరించారు. సహకార బ్యాంక్ పతాకాన్ని సైతం ఆవిష్కరించారు.
అలాగే బ్యాంకు మొబైల్ యాప్ ను నాబార్డ్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు, శత వసంతాల సంచికను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, బ్యాంకు క్యాలెండర్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్, బ్యాంకు డైరీని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, క్రిబ్ కో చైర్మన్ చంద్ర పాల్ సింగ్ యాదవ్, జాతీయ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దిలీప్ సింగ్, బీహార్ ఎమ్మెల్సీ మార్కెటింగ్ ఫెడరేషన్ చైర్మన్ సునీల్ కుమార్ సింగ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కరీంనగర్, సిరిసిల్ల జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల జడ్పీ చైర్పర్సన్ లు విజయ, అరుణ, వసంత, పుట్ట మధుకర్, కరీంనగర్ మేయర్ Y. సునీల్ రావు, నాప్ కార్డు చైర్మన్ శివ దాసు నాయర్, టీఎస్ క్యాబ్ చైర్మన్ మహేందర్ రెడ్డి, సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు, నాప్ కాబ్ ఎండీ బీమా సుబ్రహ్మణ్యం, టీఎస్ క్యాబ్ ఎండీ డాక్టర్ మురళీధర్, కే డీసీసీబీ సీఈవో ఎం సత్యనారాయణ రావు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.