పాలకుర్తి రూరల్, డిసెంబర్ 7: ఈ నెల 15 లేదా 20వ తేదీన మహబూబాబాద్లో జరిగే సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలోని పార్టీ కార్యాలయంలో 18 మందికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహబూబాబాద్లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని, నూతన వైద్య కళాశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం జరిగే బహిరంగసభకు ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో తరలిరావాలని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.20 కోట్లు మంజూరు చేశారని.. కులసంఘాల భవనాలు, సీసీ, బీటీ రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.