ఊట్కూర్, సెప్టెంబర్ 8: తెలంగాణ ప్రభుత్వం పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నది. ఇందుకు ఉదాహరణ.. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం కొత్తపల్లికి చెందిన బీజేపీ కార్యకర్తకు సీఎంఆర్ఎఫ్ సాయం అందించారు. కొత్తపల్లికి చెందిన బీజేపీ కార్యకర్త ఎరుకలి నర్సింహులు భార్య కిష్టమ్మ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో కుటుంబీకులు ఆమెను నిమ్స్లో చేర్పించారు.
గుండె ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించడంతో ఆర్థిక సాయం కోసం స్థానిక బీజేపీ నాయకులు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిని ఆశ్రయించారు. స్పందించిన ఎమ్మెల్యే శుక్రవారం 5 లక్షల ఎల్వోసీని స్థానిక బీజేపీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్రాం, సీనియర్ నేత నర్సింహకు అందజేశారు. బీజేపీ కార్యకర్త వైద్యానికి ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబసభ్యు లు, బీజేపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.