ఖమ్మం, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): సీఎమ్మార్ షాపింగ్ మాల్ అధినేత, సంస్థ ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకటరమణ ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. ఖమ్మంలో సీఎమ్మార్ షాపింగ్ మాల్ 19వ స్టోర్ ఇటీవల ప్రారంభించిన సందర్భంగా సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా గురువారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు చెక్కును అందించారు.
మంత్రిగా పువ్వాడ మూడేండ్ల్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చెక్కును చైర్మన్ వెంకటరమణ, ఎండీ మావూరు మోహన్ బాలాజీ అందజేశారు. ఈ నిధులను ఖమ్మం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల మరమ్మతుల కోసం వెచ్చించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.