హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణకు ఎఫ్సీఐ మరోసారి గడువు పొడగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. సీఎంఆర్ సేకరణకు ఏప్రిల్ నెలాఖరు వరకు గడువు పెంచినట్టు సమాచారం. దీనిపై గురువారం అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సీఎంఆర్ గడువును పెంచాలని కోరుతూ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ రాసిన లేఖను కేంద్ర ఆహార, పౌర సరఫరాశాఖ కార్యదర్శి పరిశీలించినట్టు తెలిసింది. గత యాసంగికి సంబంధించిన 43.59 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్రంలోని మిల్లర్లు బియ్యంగా మార్చి (సీఎంఆర్) ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉంది.
ఇప్పటివరకు సుమారు 42.50 లక్షల టన్నుల సీఎంఆర్ అందించారు. ఇంకా సుమారు లక్ష టన్నులకు పైగా అందించాల్సి ఉంది. ఇందుకు ఏప్రిల్ నెలాఖరు వరకు అవకాశం ఇవ్వాలని పౌర సరఫరాలశాఖ కేంద్రాన్ని కోరింది. ఇదిలాఉండగా, సీఎంఆర్ రైస్ తీసుకోవడంలో ఎఫ్సీఐ అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. చివరిరోజు ఓ జిల్లాలో ఎఫ్సీఐ గోదాంకు 12 లారీలు రాగా కేవలం నాలుగు లారీలను అనుమతించి మిగతా వాటికి అనుమతి నిరాకరించినట్లు తెలిసింది. చిన్నచిన్న కారణాలతో అవాంతరాలు సృష్టిస్తున్నట్లు ఇటు అధికారులు, అటు మిల్లర్లు వాపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..