Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): మెట్రో రెండోదశ ప్రతిపాదనలు వేగం పుంజుకున్నాయి. వీలైనంత త్వరగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారుచేసే పనిలో మెట్రో యంత్రంగా తలమునకలైంది. ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో చేపట్టిన సర్వే తర్వాత మెట్రో మార్గాల నిర్మాణంపై ఇచ్చిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం, తదుపరి దశ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మొత్తం 7 మార్గాల్లో 70 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలను నిర్మించనున్నారు. నిర్మాణ వ్యయం సుమారు రూ. 20వేల కోట్లకు పైనే అవుతుందని అంచనా. ఈ లెక్కన కిలోమీటరుకు రూ. 285 కోట్ల నుంచి 290 కోట్ల వరకు వ్యయం అవుతుందని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో చేసిన ప్రతిపాదనల్లో ప్రతి కిలోమీటరు నిర్మాణానికి రూ. 220 నుంచి రూ. 250 కోట్లు అవుతుందని అంచనా వేశారు.
పెరుగుతున్న వ్యయం
కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ఎయిర్పోర్టు మెట్రో కారిడార్ను పక్కనపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మార్గంలో నిర్మించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం రాయిదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు ప్రతిపాదించిన మార్గంలో కొన్ని మార్పులు చేసి 31 కిలోమీటర్ల మార్గాన్ని 8 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించింది.
రాయదుర్గం నుంచి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకు సీఎం రేవంత్ మొదట ప్రతిపాదించిన మార్గం నిర్మాణం గచ్చిబౌలి మీదుగా చేపట్టడం అసాధ్యమని తేలడంతో, కేసీఆర్ ప్రభుత్వం అంతిమంగా ఖరారు చేసిన మార్గంలోనే నిర్మించాలని ఇటీవల ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.
మెట్రో కారిడార్లు ఎక్కడ అవసరమో గుర్తించి, దానికి అనుగుణంగానే కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పక్కన పెట్టి కొత్తగా మార్గాలను ఎంచుకున్నా నిర్మాణం వ్యయం తగ్గకపోగా ఎక్కువగా అయ్యే అవకాశం ఉందని మెట్రో అధికారుల ప్రాథమిక అధ్యయనంలో తేలింది. మరో 3 నెలల్లో పూర్తిస్థాయిలో రూపొందించే డీపీఆర్లో ప్రాజెక్టు అంచనా వ్యయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కేంద్రం సహకరించేనా?
హైదరాబాద్లో రెండోదశలో చేపడుతున్న మెట్రో మార్గాల నిర్మాణానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఉంటుందన్న దానిపైనా ప్రస్తుతం మెట్రో వర్గాల్లో చర్చ జరుగుతున్నది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకే నిధులు మంజూరు చేసే కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో రెండో దశకు అవసరమైన అనుమతులు, నిధులను సకాలంలో ఇస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం బీహెచ్ఈల్ నుంచి లక్డీకాపూల్ వరకు నిర్మించాలని సిద్ధం చేసిన డీపీఆర్ను కేంద్రానికి పంపి 3 ఏండ్లు గడిచినా ఇప్పటికీ అనుమతులు రాలేదు. ఏదీ ఏమైనా మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం ఆర్థిక భారంతో కూడు
కొని ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.