Elevated Corridor | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారిపై రూ. 2232 కోట్లతో నిర్మించే భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అల్వాల్లో శంకుస్థాపన చేయనున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా కింద రోడ్డు మార్గం, పైన మెట్రోరైలు వెళ్లేలా రాజీవ్ రహదారితోపాటు నాగపూర్ వెళ్లే మార్గంలో కూడా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేసింది. అయితే, కంటోన్మెంట్లో రక్షణ శాఖకు చెందిన భూములను కేంద్రం ఇవ్వకపోవడంతో ఈ కారిడార్ల నిర్మాణం పెండింగ్లో పడింది.
తాజాగా, కేంద్రం రక్షణశాఖ భూములు ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో కారిడార్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. ఇందులో భాగంగా మొదలు రాజీవ్ రహదారిపై ప్యారడైజ్ నుంచి హకీంపేట్ వరకు సుమారు 19 కిలోమీటర్ల పొడవున కారిడార్ నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలోని ప్రణాళికలనే అమలు చేస్తుందా.. లేక మారుస్తారా అనేది స్పష్టత లేదు. కారిడార్కు సంబంధించి డీపీఆర్ల రూపకల్పన బాధ్యతను ప్రభుత్వం హెచ్ఎండీఏకు అప్పగించింది.