Minister Sridhar Babu | హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో గురువారం సచివాలయంలో తొలి క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు అన్ని శాఖల్లో చేసిన ఖర్చు, వాటివల్ల ఏ మేరకు ప్రయోజనం కలిగిందో ప్రజలకు శ్వేతపత్రం ద్వారా వివరిస్తామని చెప్పారు.
ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మొదటి విడతగా రెండు గ్యారెంటీలను అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ నెల 9వ తేదీన కాంగ్రెస్ నేత సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య పరిమితి రూ.10 లక్షలకు పెంపు హామీలను అమలు చేయనునున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఆయా శాఖల అధికారులతో చర్చించనున్నట్టు తెలిపారు. మహిళలు 9వ తేదీ నుంచి ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎస్ శాంతికుమారి ప్రారంభిస్తారని తెలిపారు.
గురువారం ప్రమాణం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని శ్రీధర్బాబు తెలిపారు. పార్టీ అధిష్ఠానంతో సంప్రదించిన తర్వాతే శాఖల కేటాయింపు ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు సరఫరాను కొనసాగిస్తామని చెప్పారు. పదేండ్లలో ఉచిత విద్యుత్తు అమలు చేసిన తీరుపై అధికారులను వివరాలను కోరామని తెలిపారు. శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి విద్యుత్తు శాఖపై సమీ క్ష నిర్వహిస్తారని చెప్పారు.
గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరాపై క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు. రైతులకు పెట్టుబడి సాయానికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి వివరాలు కోరామని, దీనిపై త్వరలో నిర్ణయం చెప్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వనరుల సేకరణపై వివరాలు వచ్చిన తర్వాత మిగతా గ్యారెంటీలపై ప్రకటన చేస్తామని తెలిపారు. 9న అసెంబ్లీ స మావేశం నిర్వహిస్తామని, సభ్యుల ప్రమాణ స్వీ కారం ఉంటుందని, అనంతరం స్పీకర్ ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు. మిగతా మంత్రివర్గ కూర్పుపై హైకమాండ్తో చర్చించిన తర్వా త నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్నారు.