హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతున్నదని చెప్పారు. మహిళల సాధికారితతో పాటు ఆర్థిక స్వాలంబనకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికీ రూ.500 గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని అన్నారు.
అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు దక్కాలని సీఎం ఆకాంక్షించారు. మహిళల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల ద్వారా త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపడుతామన్నారు. మహిళలకు అండగా ఉండేలా తమ ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలు అందుబాటులోకి తెస్తుందని అన్నారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం తప్పకుండా దేశమందరి దృష్టిని ఆకర్షిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు.
“నా సోదరీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” @revanth_anumula #WomenEmpowerment #Telangana #WomensDay #InternationalWomensDay pic.twitter.com/aP7UW0E90G
— Telangana CMO (@TelanganaCMO) March 8, 2024