హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆదివారం హైదరాబాద్లోని సచివాయంలో సమావేశం కానున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు, పాలనా యాంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లే ప్రజాపాలన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్ల సమావేశంలో వెల్లడించనున్నా రు. ఆర్థిక సాధికారిత కల్పించడం ద్వారా సామాజిక న్యాయం కల్పించేందుకు ప్రకటించిన ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దకేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చడం, జవాబుదారీగా ఉండేందుకు ప్రజా పాలన చేపడుతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 28వ తేదీ నుంచి 2024 జనవరి 6వ తేదీ వరకు సెలవు రోజులు మినహాయించి మొత్తం 8 పనిదినాలు ఈ ప్రజాపాలన కొనసాగనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు గ్రామ సభలు నిర్వహిస్తారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార, ఇతర మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొననున్నారు.