CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్రెడ్డి సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులు, సీఎస్ శాంతికుమారితో పాటు వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉమ్మడి జిల్లాల నోడల్ అధికారులు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితర ఉన్నతాధికారులు హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ prajapalana.telangaana.gov.inను సీఎం ప్రారంభిస్తారు. కాంగ్రెస్ నెల రోజులు పాలనపై శాఖల వారీగా తీసుకున్న నిర్ణయా లు, ఫలితాలను ఈ సమావేశంలో చర్చిస్తారు.
కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి మరో గ్యారెంటీని ప్రారంభించాలని యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కలిగే లా ఒకదానిని ఎంపిక చేసే అంశం పై మంత్రుల బృందం చర్చిస్తుంది. ఇటీవల ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచింది. ఈ హామీని నెరవేర్చడం వల్ల ప్రభుత్వంపై ఇప్పటికప్పుడు పడే ఆర్థికభారం పెద్దగా ఉండదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇంచుమించు ఇలాంటిదే.
ఈ నేపథ్యంలో తక్కువ ఆర్థికభారం పడేలా రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ పథకం అమలు చేయడం ద్వారా ప్రభుత్వంపై నెలకు రూ.350 కోట్ల భారం మాత్రమే పడుతుంది. రాయితీని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేయాలా? లేదంటే, కంపెనీకి చెల్లించాలా? అన్న విషయమై మంత్రుల బృందం నిర్ణయం తీసుకోనుంది. కేంద్రం ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం 2022-23లో తెలంగాణలో 6.67 కోట్ల గృహ వినియోగ సిలిండర్లు బుక్ అయ్యాయి. ఈ లెక్కన ఒక్కో కుటుంబం సగటున ఏడాదికి ఆరు సిలిండర్లు వినియోగిస్తున్నట్టు లెక్క. ఈ నేపథ్యంలో రాయితీని ఆరు సిలిండర్లకు పరిమితం చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.
ప్రజాపాలనకు సంబంధించి పది రోజుల్లో 1,25,84,383 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిలో ఐదు గ్యారెంటీలకు 1,05,91,636 దరఖాస్తులు రాగా, ఇతర అభ్యర్థన కోసం 19,92,747 వచ్చాయి. ఒక్క హైదరాబాద్ నుంచే 13.7 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 16,392 గ్రామ పంచాయితీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించారు. దరఖాస్తుల డాటాఎంట్రీని ఈ నెల 17లోగా పూర్తిచేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.