హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): నగరంలోని మూసీ నది పరివాహక ప్రాంతం అభివృద్ధికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మంగళవారం నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్, హెచ్ఎండీఏ జాయిం ట్ మెట్రోపాలిటన్ కమిషనర్ అమ్రపాలి, సీఎం ఓఎస్డీ అజిత్రెడ్డితోపాటు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మూసీనది పరివాహక ప్రాంతాన్ని రాబోయే 36 నెలల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. అందులో భాగంగా తొలుత హైదరాబాద్ నగరం పరిధిలోని 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్దేశించారు.
అన్ని వర్గాల ప్రజలకు అనువైన ఐకానిక్ డిజైన్ ఎంపిక చేయాలని అధికారులకు సూ చించారు. అమ్యూజ్మెంట్ పార్కు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్స్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఏరియా, షాపింగ్మాల్స్ ఇలా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ ఉండాలని చెప్పారు. ఇందుకోసం విదేశాలతోపాటు దేశంలోని ఇతర రాష్ర్టాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల డిజైన్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. 3 నెలల్లోలోగా సంబంధిత పనులు ప్రారంభించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆకస్మిక వరదలు వచ్చినా తట్టుకొనే విధంగా వర్షపు నీటిని మూసీలోకి మళ్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మూసీనది పరివాహక అభివృద్ధికి భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న చారిత్రక కట్టడాలైన చార్మినార్, తారామతి బరాదరి, ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్యూట్ డిజైన్ రూపొందించాలని అన్నారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.