హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆడబిడ్డల చేతుల్లోనే ఉన్నదని, రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్యను కోటి మందికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన మహిళా శక్తి వారోత్సవాల ముగింపుసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 553 కొత్త బస్సులను మహిళా సంఘాలకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మహిళలను కేవలం చిన్న చిన్న పనులకే పరిమితం చేయకుండా అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తలతో పోటీపడేలా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించామని చెప్పారు.

భవిష్యత్తులో మహిళా సంఘాలకు వెయ్యి కాదు.. ఏకంగా 3 వేల బస్సులు కొనిచ్చి వారిని యజమానులను చేస్తామని తెలిపారు. అలాగే విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టుపని కూడా మహిళా స్వయం సహాయక సంఘాలకే ఇచ్చామని అన్నారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఐటీ హబ్ అయిన హైటెక్ సిటీలో 106 ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామని, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ -కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా ఆన్లైన్లో విక్రయించేలా గ్లోబల్ మార్కెట్ సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో 2034 వరకు ఈ ప్రజాప్రభుత్వాన్ని ఇలాగే విజయవంతంగా నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రైతులు ఒకే రకమైన పంటపై ఆధారపడకుండా, మార్కెట్ డిమాండ్ను బట్టి అన్నిరకాల పంటలు వేసేలా గ్రామాల్లో రైతులకు మహిళా సంఘాలు అవగాహన కల్పించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క, రవాణాశాఖ మంత్రి పొన్నంప్రభాకర్, రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.