హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు అటకెక్కింది. రూ.6,250 కోట్ల అంచనా వ్యయంతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టి, శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు (కెప్ట్ ఆన్ హోల్డ్) రేవంత్రెడ్డి సర్కారు ప్రకటించింది. రద్దు లేదు.. స్ట్రీమ్ లైన్ అంటూనే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది. సచివాలయంలో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) అధికారులతో మంగళవారం సీఎం రేవంత్రెడ్డి మెట్రో విస్తరణ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం కార్యాలయం నుంచి అధికారికంగా వెలువడిన పత్రికా ప్రకటనలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన రాయదుర్గం-ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపారు. పలు విస్తరణ ప్రాజెక్టులతోపాటు పాతబస్తీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. ఐదు మార్గాల్లో 76 కిలోమీటర్ల మేర ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. వీటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహించి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసీని అనుసరిస్తూ నార్సింగి నుంచి తారామతిపేట వరకు (ఈస్ట్ టు వెస్ట్) 40 కిలోమీటర్లు, కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించిన ప్యారడైజ్-కండ్లకోయ, జేబీఎస్-శామీర్పేట డబుల్ డెక్కర్ మెట్రో ప్రాజెక్టులపైనా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలపై సీఎం నిర్వహించిన సమీక్షలో ఎంఎయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ కొత్తగా చేపట్టే మెట్రో మార్గాలు ఎక్కువ మంది ప్రజలకు అనుకూలంగా ఉండేలా చూడాలని సూచించారు. పాతబస్తీలో దార్-ఉల్-షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మీదుగా నిర్మించే మార్గం కోసం రోడ్డును 100 అడుగుల విస్తీర్ణంతో చేపట్టాలని, ఇందుకోసం స్థానిక ప్రజా ప్రతినిధులను సంప్రదించి, రోడ్డు విస్తరణ పనులు సాఫీగా జరిగేలా చూడాలని సూచించారు. పాతబస్తీ మీదుగా మెట్రో రైలు మార్గం నిర్మాణం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించి, పనులు మొదలుపెట్టిన రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్పోర్టు (31 కిలోమీటర్లు) హోల్డ్లో ఉంచాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఆ మార్గంలో ఔటర్ రింగురోడ్డు అందుబాటులో ఉన్నదని, దానికి బదులుగా ఎయిర్పోర్టుతో మెట్రో అనుసంధాన మార్గాన్ని ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా చేపట్టాలని సూచించారు. వాస్తవానికి రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రోను ప్రతిపాదించినప్పుడు ప్రయాణికుల బ్యాగేజీ చెకింగ్ను కూడా అక్కడే పూర్తిచేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుందని భావించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడిది గందరగోళంలో పడింది.
నగరంలో మెట్రోరైలు కొత్త మార్గాల ప్రతిపాదనలపై త్వరలోనే కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ను కలవాలని, ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. 40 కిలోమీటర్ల పొడవున ఉన్న మూసీ తీర ప్రాంతంలో మెట్రో రైలు కారిడార్ను నిర్మించేందుకు పురపాలక శాఖ, మెట్రో అధికారులు కలిసి పని చేయాలని, నాగోల్, ఎంజీబీఎస్ల మీదుగా మూసీ వెంట నార్సింగి నుంచి తారామతిపేట వరకు ఈ మెట్రో రైలుమార్గం అనుసంధానం అయ్యేలా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం సూచించారు.శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా కందుకూరు వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుందని, దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. కందుకూరు ప్రాంతంలో మెగా టౌన్షిప్ నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నదని, దానికి అనుగుణంగా మెట్రో మూడో దశను సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటితోపాటు జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి షామీర్పేట, ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ వరకు మెట్రో మార్గాలను నిర్మిస్తామని తెలిపారు.