హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అభివృద్ధి విషయంలో వారి నిర్ణయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. పరిపాలనపై తనకు కొంత సమాయం కావాలని, ఎవరూ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ నానక్రామ్గూడలో నిర్మించిన అగ్నిమాపక శాఖ కేంద్ర కార్యాలయం, కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అగ్నిమాపక శాఖ కేవలం అగ్ని ప్రమాదాల నివారణకే కాదన్నారు. ఎన్నో విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు అమూల్యమని కితాబిచ్చారు. అగ్నిప్రమాదాల్లో ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడారని చెప్పారు. అగ్నిమాపక శాఖకు మంచి భవనం లేకపోవడం సరికాదని తెలిపారు. శాంతి భద్రతలు బాగుంటేనే నగరం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.
హైదరాబాద్ అభివృద్ధిపై కొందరికి కొన్ని అపోహలు ఉన్నాయని, వాటి గురించి చర్చించుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నగర శివారు ప్రాంతాలకు త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డు వస్తుందని చెప్పారు. రింగు రోడ్డు చుట్టూ మెట్రో రైలు సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. హైదరాబాద్తోపాటు మొత్తం తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు భాగాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామన్నారు.
ఫార్మా సిటీ కట్టడం లేదని కొందరు ఆరోపిస్తున్నారని, అంతర్జాతీయ ఎయిర్పోర్టు పక్కన ఫార్మా పరిశ్రమలు సరికాదని వెల్లడించారు. ఒకే చోట కాకుండా 10 నుంచి 15 ప్రాంతాల్లో ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఒకే చోట 25 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఉంటే నగరం కలుషితం అవుతుందని చెప్పారు. అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటే మేడిగడ్డ వలే అవుతుందన్నారు. రాజకీయంగా తనకు అవగాహన ఉందని వెల్లడించారు. త్వరలో నిర్మాణ సంస్థలతో చర్చిస్తామని తెలిపారు. తమను తాము అపర మేధావుల్లా భావించడం లేదని చెప్పారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తామూ శివబాలకృష్ణలా జైల్లో కూర్చోవాల్సి ఉంటుందని వెల్లడించారు. తాను అప్పుడప్పుడు కనిపించే సీఎంను కాదని, రెగ్యులర్గా కనిపిస్తానని చెప్పారు.