CM Revanth Reddy | గృహ జ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27, లేదంటే 29న పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సూచించారు. సచివాలయంలో సీఎం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కేబినెట్ సబ్ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీల్లో గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ల పథకాల అమలకు ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు. అర్హులందరికీ రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా..? ఏజెన్సీకి చెల్లించాలా?.. అందుకు ఎదురయ్యే సాధ్యాసాధ్యాలపై ఆర్థిక, పౌరసరఫరాల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎలాగైన లబ్ధిదారులకు రూ.500 సిలిండర్ ఇచ్చేలా చూడాలన్నారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరుపాలని సూచించారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంటవెంటనే చెల్లించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గృహజ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి.. 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ను వినియోగించే వారికి పథకం వర్తింజేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మార్చి మొదటి వారం నుంచి బిల్లు జారీ చేసేసమయంలో అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు.
ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నంబర్లు, కనెక్షన్ నంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే.. సవరించుకునే అవకాశమివ్వాలని సీఎం సూచించారు. విద్యుత్ బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేపట్టాలన్నారు. తప్పులను సవరించుకున్నఅర్హులందరికీ తదుపరి నెల నుంచి పథకం వర్తింపజేయాలని చెప్పారు. దరఖాస్తు చేసుకోని వారుంటే ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కొనసాగించాలన్నారు.