Green Pharma City | హైదరాబాద్ శివారులోని గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో సీఎంతో పాటు పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు, సీఎస్ శాంతికుమారి గ్రీన్ ఫార్మా సిటీ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో ముచ్చర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన పరిసరాల్లో గ్రీన్ ఫార్మా సిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. పర్యావరణహితంగా కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిశ్రమల అభివృద్ధి జరగాలన్నారు. అక్కడ అభివృద్ధికి అవసరమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల నిర్మాణాలను వీలైనంత తొందరగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని, వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఉండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పనులు చేయాలని సూచించారు. గ్రీన్ ఫార్మా సిటీలో పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని, త్వరలోనే ఆ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతామని సీఎం తెలిపారు.
ఔషధాల తయారీ కంపెనీలు, బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కొత్తగా నెలకొల్పే అత్యాధునిక గ్రీన్ ఫార్మా సిటీ సింగిల్ స్టాప్గా ఉండాలని అభిప్రాయపడ్డారు. యాంటీ బయాటిక్స్, ఫెర్మంటేషన్ ఉత్పత్తులు, సింథటిక్ డ్రగ్స్, రసాయనాలు, విటమిన్లు, వ్యాక్సిన్లు, డ్రగ్ ఫార్ములేషన్స్, న్యూట్రాస్యూటికల్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, ప్రత్యేక రసాయనాలు, కాస్మోటిక్స్ తదితర సంబంధిత ఉత్పత్తులన్నింటికీ ఫార్మా సిటీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. పరిశోధన, శిక్షణ, నైపుణ్యాలకు అవసరమైన ప్రత్యేక విశ్వ విద్యాలయం ఉంటుందని అన్నారు. హెల్త్ కేర్, ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అందులో కోర్సులు నిర్వహించాలని సూచించారు.