Digital Health Cards | కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు (FDC) సంబంధించి రాష్ట్ర సచివాలయంలో సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రల్లో పర్యటించిన అధికారులు చేసిన అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
కార్డుల రూపకల్పలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను అధికారులు వివరించారు. అనంతరం సీఎం రేవంత్ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలని, లోపాలను పరిహారించాలన్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన పని లేదన్నారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సమచార సేకరణ, వాటిల్లో ఏయే వివరాలు పొందుపర్చాలి, అప్డేట్కు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహలతో కూడిన మంత్రివర్గ ఉప సంఘానికి అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మంత్రివర్గ ఉప సంఘం సూచనల మేరకు అందులో జత చేయాల్సిన, తొలగించాల్సిన అంశాలను సమగ్ర జాబితా రూపొందించాలని సూచించారు. అనంతరం రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో రెండు ప్రాంతాలు ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని సీఎం సూచించారు.
కుటుంబాల నిర్ధరణ, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వివరాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డాటా ఆధారంగా అక్టోబర్ 3 నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేయించాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టును పకడ్బందీగా చేపట్టాలని, ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి అధికారిని, పట్టణాలు, నగర ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారిని పర్యవేక్షణ కోసం నియమించాలన్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇటీవల వరదల సమయంలో వేసిన సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. క్షేత్ర స్థాయి పరిశీలన సమగ్రంగా కచ్చితత్వంతో చేపట్టాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలని హెచ్చరించారు.