హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్కుమార్కు స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ఏపీకి చెందిన టీడీపీ ఎంపీకి గంటల వ్యవధిలోనే స్టేషన్ బెయిల్ లభించడంపై రెండు తెలుగు రాష్ర్టాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే మహేశ్కుమార్కు స్టేషన్ బెయిల్ లభించడంపై తన ప్రమేయం ఏమీ లేదని సీఎం రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇందులో ప్రభుత్వ పాత్రపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఎంపీ పుట్టా మహేశ్కుమార్కు చట్ట నిబంధనల ప్రకారమే స్టేషన్ బెయిల్ లభించిందని చెప్పారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరిపేందుకు ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటుచేశామని అన్నారు. ఢిల్లీలో బుధవారం పార్లమెంటు భవన్ సముదాయంలో తనకు ఎదురుపడిన మీడియా ప్రతినిధులతో రేవంత్రెడ్డి కొద్దిసేపు మాట్లాడారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2029లో జరుగుతాయని, షెడ్యూల్ ప్రకారం 2028లో జరిగే అవకాశం లేదని చెప్పారు. కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): అత్యంత కీలకమైన అ సెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ.. ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలకు ఏర్పాటు చేస్తున్నది. ఈ మేరకు ఈనెల 26 నుంచి 30 వరకు గచ్చిబౌలి, ఎల్బీస్టేడియాల్లో ఈ క్రీడా పోటీలను నిర్వహించనున్నది. కబడ్డీ, రన్నింగ్ (అథ్లెటిక్స్), క్రికెట్, అంతాక్షరి వంటి పోటీలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనుండగా, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పోటీలు నిర్వహించనున్నట్టు సమాచారం. వరుస సెలవులతో బడ్జెట్పై చర్చకు సమయం సరిపోవడం లేదన్న వాదనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఆటల పోటీలేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.