Revanth Reddy | హైదరాబాద్ నగరంలో రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములను కేటాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్రమంత్రి రాజ్నాథ్ను ఢిల్లీలోని ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి శుక్రవారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ భూములను బదలాయించాలని కోరారు.
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెహిదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామని, ఇందుకోసం అక్కడ ఉన్న రక్షణ శాఖ భూమి 0.21 హెక్టార్లను బదిలీ చేయాలని రాజ్నాథ్సింగ్ను రేవంత్ రెడ్డి కోరారు. ఆ ప్రాంతంలో స్కైవే నిర్మాణం పూర్తి కావస్తున్న ఆ భూమిని వెంటనే బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి రాజ్నాథ్ సింగ్ సుముఖత వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రాజీవ్ రహదారిలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి అవుటర్ రింగు రోడ్డు జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరమని దానిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. నాగ్పూర్ హైవే (ఎన్హెచ్-44)పై కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామని, అందులో 12.68 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలకు, భవిష్యత్తులో డబుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్, ఇతర నిర్మాణాలకు మొత్తంగా 56 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని కోరారు. సీఎం విజ్ఞప్తులకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.
నిధులు విడుదల చేయండి
తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద 2019-20, 2021-22 నుంచి 2023-24 వరకు సంవత్సరానికి రూ.450 కోట్ల చొప్పున విడుదల చేయాల్సిన రూ.1800 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఙప్తి చేశారు. 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.2,233.54 కోట్లు త్వరగా విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.