Praja Darbar | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్లో ప్రజాదర్బార్ను ప్రారంభించారు. ప్రజాభవన్కు వచ్చిన వారి నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిషారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొదటగా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చిన రేవంత్ వారి సమస్యలను అడిగి తెలుసుకుని వినతులను స్వీకరించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ (సీతక) ఉన్నారు. అత్యవసర సమావేశం నిమిత్తం సీఎం సెక్రటేరియట్ బయలుదేరగా, ప్రజా దర్బార్కు వచ్చి న వారి నుంచి మంత్రి సీతక సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరించారు.
సీఎం కార్యాలయం ముఖ్యకార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, జలమండలి ఎండీ దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ముషారఫ్ అలీ తదితర అధికారులు ప్రజాదర్బార్ నిర్వహణను సమన్వయం చేశారు. గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్లకు 15 డెసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. లోపల 350కిపైగా కుర్చీలు వేశారు. బయట క్యూలో ఉన్నవారికి ఎండ నుంచి రక్షణ కోసం టెంట్లు, నీటి వసతి కల్పించారు. ప్రతి దరఖాస్తు పత్రాన్ని ఆన్లైన్ ఎంట్రీ చేసి, ప్రత్యేక గ్రీవెన్స్ నంబర్, రసీదు ఇచ్చారు. ప్రింట్ అందని వారికి ఎస్ఎంఎస్ పంపారు.
దరఖాస్తుల నిర్వహణ బాధ్యత ‘యాప్జోన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ సిబ్బందికి ఇచ్చినట్టు తెలుస్తున్నది. హైదరాబాద్ నుండే కా కుండా వివిధ జిల్లాల నుంచి వినతులతో వచ్చిన ప్రజలతో ప్రజాదర్బార్ రద్దీగా మారిం ది. ఉదయం 8 గంటల నుంచే ప్రజాభవన్కు వినతులతో ప్రజల తాకిడి ఎక్కువ కావటంతో తోపులాట జరిగింది. వారిని అదుపు చేసేందుకు పోలీసు బలగాలను దింపి, బారికేడ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మూడు చెక్ పాయింట్లలో అందర్నీ పరీక్షించాకే లోపలికి అనుమతించారు. ప్రజా దర్బార్కు భారీగా తరలి రావటంతో ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యి, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.