KTR | సీఎం రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో నడవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీలో ఆయనది నడవకున్నా.. పైసలు మాత్రం బాగానే సంపాదిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్లో బీజేపీ కోవర్టులు ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించే రాహుల్ గాంధీ అన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి విమానం ఎక్కడం.. దిగడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా.. పూర్తి స్థాయి మంత్రివర్గం లేదని కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో టీడీఆర్ తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీలో 400 ఎకరాల భూమిని టీడీఆర్ ద్వారా సేకరించామని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వెనుక నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారని కేటీఆర్ తెలిపారు. టీడీఆర్ ఎక్కడ ఉన్నాయోనని ఆ నలుగురు బ్రోకర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. టీడీఆర్ పేరుతో వేల కోట్ల కుంభకోణానికి ఆ నలుగురితో కలిసి రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడని అన్నారు. హైదరాబాద్లో టీడీఆర్ మొత్తం షేర్లను కొంతమంది రేవంత్ అనుచరులు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే లక్ష చదరపు అడుగులు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎఫ్ఎస్ఐ నియంత్రిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఆప్రకటన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడతారని తెలిపారు. అప్పుడు టీడీఆర్లను అడ్డగోలు ధరలకు అమ్మేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు. టీడీఆర్పై రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
టీడీఆర్కు గత నెల రోజుల్లో విపరీతమైన గిరాకీ పెరిగిందని కేటీఆర్ తెలిపారు. టీడీఆర్ పేరిట భారీ లూటీ జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా టీడీఆర్ అనుమతులు ఇచ్చామన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. ఆ అనుమతులు ఇచ్చింది.. ఎఫ్ఎస్ఐ తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే తెలిపారు. ఎఫ్ఎస్ఐ నియంత్రణ వైఎస్ఆర్ హయాంలో ఎత్తివేస్తే.. తాము కొనసాగించామని గుర్తుచేశారు.
రాష్ట్ర రెవెన్యూను పెంచేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించడం లేదని విమర్శించారు. డబ్బులు ఎలా కాపాడుకోవాలో సీఎం రేవంత్ రెడ్డికి తెలిసినంతగా మరే ముఖ్యమంత్రికి తెలియదని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక దందా జోరుగా సాగుతుందని ఆరోపించారు. టీడీఆర్ విషయంలో మాసివ్ లూట్ జరుగుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తెలిపారు.
ప్రధాని మోదీని మంచోడు అనకపోతే జైలులో వేస్తాడని సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నాడని కేటీఆర్ అన్నారు. ఆ పని కిషన్ రెడ్డి చేయలేడని.. ఆయన నిస్సహాయుడు అని చెప్పారు. అందుకే కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్లో ఎయిర్పోర్టుకు కృషి చేసింది ఎవరో అందరికీ తెలుసని ఆయన అన్నారు. మామునూరు ఎయిర్పోర్టు కోసం మేం కృషి చేస్తే.. కాంగ్రెస్ నాయకులు పేరు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. తమకు ఉన్న బలంతోనే ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నామని తెలిపారు.