హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): సమాజంలో అశాంతి, అసూయను అధిగమించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్లోని మహాబోధి బుద్ధ విహార్లో జరిగిన బుద్ధ పూర్ణిమ వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంయుక్త నిఖాయ నాలుగో నిఘంటువును ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మహాబోధి బుద్ధ విహార్కు రావడం గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందని సంతోషం వ్యక్తంచేశారు.
గౌతమ బుద్ధుడి బోధనలు అందిరికీ అవసరమని పేర్కొన్నారు. రాజ్యం, అధికారం ఉండీ వాటిని కాదని 29 ఏండ్ల వయసులోనే శాంతి కోసం బుద్ధుడు ఆలోచించాడని గుర్తుచేశారు. ప్రస్తుతం సమాజంలో స్పర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం నెలకొని ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. బుద్ధుని సందేశం దేశానికి ఇప్పుడు ఎంతో అవసరమని తెలిపారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉన్నదని చెప్పారు. ప్రతి పనిని ధ్యానంగా చేయాలన్న సూచనలో చాలా అర్థం ఉన్నదని, ఈ సూక్తి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందినట్టు చెప్పారు. ఏ పని అయినా తాను ఎంతో ధ్యానంగా చేస్తానని తెలిపారు. ధ్యాన మందిరం కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ధ్యాన మందిరం ఆధ్వర్యంలో పాఠశాలను నిర్వహించాలని కోరారు. తెలంగాణలో బుద్ధ బిక్షులకు తగిన గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. మహాబోధి బుద్ధవిహార్కు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని రేవంత్ తెలిపారు.