CM Revanth Reddy | రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడుచుకోవడం సరికాదని, యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కని, రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయింబర్స్మెంట్, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది అన్నింటిపైనా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మౌలిక వసతులు, అర్హతలున్న సిబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన విద్యను ప్రైవేట్ యూనివర్సిటీలు ఎలా విద్యను అందిస్తున్నాయో నివేదికను ఇవ్వాలన్నారు.
ఇండ్ల ప్లాట్లకు రిజిష్ట్రేషను అయిన భూములను, ధరణిలో చూపించినా ప్రైవేట్ యూనివర్సిటీకి అనుమతిని ఇచ్చారని, అలాంటి వాటిలో ఎలాంటి విద్యను అందిస్తున్నాయనే నివేదికను ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇండ్ల స్థలాల కింద రిజిస్టర్ అయిన.. వివాదంలో ఉన్న భూముల్లో యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడంతో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.
యూనివర్సిటీకి అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వ్యవహారంతో గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సర్వశిక్షా అభియాన్ (SSA) నిధులతో ‘మన ఊరు-మన బడి’ కింద ఖర్చు చేసిన నిధులకు సంబంధించి సమగ్రంగా విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. కార్యక్రమం కింద ఇప్పటి దాకా జరిగిన నిధుల వినియోగంపైనా సమగ్రంగా విచారణ జరిపి, నివేదికను ఇవ్వాలన్నారు.