CM Revanth Reddy | మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై సచివాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోని పంచాయతీల్లో బడి ఉండాలని రేవంత్ స్పష్టం చేశారు. బడిలేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దన్నారు. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తండా అయినా తప్పకుండా ఓ ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనన్నారు. ఏ ఒక్క బాలుడు, బాలిక చదువుల కోసం ఇతర గ్రామాలు, పట్టణాలకు వెళ్లే పరిస్థితి ఉండొద్దన్నారు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలని ఆదేశించారు.
ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందేనన్నారు. ఇందు కోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి డీఎస్సీని నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలనిన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సమీక్షించారు. కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో ఉన్న అవాంతరాలపై దృష్ఠిసారించాలని సీఎం ఆదేశించారు.
బదిలీల అంశంలో ఉన్న అవాంతరాలను, అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యాలయాలకు విద్యుత్ బిల్లులకు సంబంధించి కేటగిరి మార్పునకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం సూచనలు చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాల గురించి అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేశారు.
రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ప్రారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యం గల ఉద్యోగాలను సాధించే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీలుండాలన్నారు. వీటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘ కాల కోర్సులను ప్రవేశ పెట్టాలని పేర్కొన్నారు. ఈ విషయంలో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న స్కిల్ యూనివర్సిటీలని అధ్యయనం చేయాలన్నారు. కొడంగల్ నియోజక వర్గంతోపాటు తొమ్మిది జిలాల్లో ఈ స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇందుకు విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి తగు ప్రతిపాదనలను సమర్పించాలని సీఎస్ను ఆదేశించారు. సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.