హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు కోతలు లే కుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శనివారం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విద్యుత్తు కోతలతో హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
విపత్తు నివారణకు కొత్త నిర్వహణ
హైదరాబాద్కు సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఓ కొత్త విపత్తు నివారణ వ్యవస్థను రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఔట ర్ రింగ్రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని యూనిట్గా తీసుకొని విపత్తు నివారణ వ్యవస్థను రూపొందించాలని చెప్పారు. జూన్ 4లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. నాలాల పూడికతీతలో నిర్లక్ష్యంగా ఉండొద్దని చెప్పారు.
ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత తనిఖీలు నిర్వహిస్తానని, ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఏరియాలో నాలాల సమస్యలు తలెత్తకుం డా యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై రేవంత్రెడ్డి నారోటిక్ డ్రగ్స్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఎవరిన్నీ ఉపేక్షించొద్దని ఉద్బోధించారు. యాంటి డ్రగ్స్ టీమ్స్ను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
మల్లన్న గెలుపునకు కృషి చేయండి
నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపుకోసం కృషి చేయాలని సీపీఎం, సీపీఐ, జనసమితి పార్టీలను సీఎం రేవంత్రెడ్డి కోరారు. శనివారం ఆయా పార్టీల నేతలతో కలిసి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి సంబంధించిన వివరాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ వెల్లడించారు. సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఎం వీరయ్య పాల్గొన్నారు.