CM Revanth | విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో అంగన్వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని.. మూడో తరగతి వరకు అందులోనే విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సచివాలయంలో విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై భేటీలో చర్చించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ సమస్యలను, విద్యావ్యవస్థలో లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ తీసుకువచ్చారు. అనంతరం సీఎం మాట్లాడుతూ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించినట్లు తెలిపారు. ప్రతీ అంగన్వాడీలో విద్యాబోధనకు ఒక టీచర్ను నియమించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. మూడో తరగతి వరకు అందులోనే విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్కు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించే యోచన చేస్తున్నట్లు తెలిపారు.
రెసిడెన్షియల్ స్కూల్స్తో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొననసాగిస్తామని.. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దశలవారీగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలకు డెవలప్మెంట్ గ్రాంట్స్ కేటాయించాలని విద్యావేత్తలు కోరగా.. విద్యా, వ్యవసాయరంగ సమస్యల పరిష్కారానికి త్వరలో కమిషన్లను వేయనున్నట్లుగా వివరించారు.