వ్యవసాయ యూనివర్సిటీ, జూలై 7: ప్రతి ఒక్కరూ విధిగా రెండు మొక్కలు నాటాలని, తల్లిలా వాటిని కాపాడడం వల్ల రాష్ట్రం పచ్చదనం సంతరించుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. వనం పెంచితేనే మనం క్షేమంగా ఉండగలుగుతామని చెప్పారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బొటానికల్ గార్డెన్స్లో రుద్రాక్ష మొక్కనాటి వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రెండు మొక్కల చొప్పున నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రధానంగా తల్లులు మొక్కలు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్లే జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పారు. పిల్లలు కూడా తమ తల్లుల పేరుమీద మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.
మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. వెనుకబడిన తరగతులకు మహిళలను ఆర్థికంగా ఎదగడమే తమ లక్ష్యమన్నారు. మహిళలు ఆర్థికంగా రాణిస్తేనే వారికి ఇంటితోపాటు రాష్ట్రంలో, దేశంలో ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. వారు ఆత్మ గౌరవంతో రాణిస్తే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, నాగర్ కర్నూల్ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. యూనివర్సిటీలోని అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలను తరలించారు.