హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జీవవైవిధ్యం, హెరిటేజ్ ప్రదేశాలు, సంస్కృతికి అద్దం పట్టే ప్రాంతాలను గుర్తించి ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అటవీ, పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో పాటు అటవీశాఖ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో కవ్వాల్, దక్షిణ తెలంగాణ వైపు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
అటవీశాఖ నుంచి డిప్యూటేషన్పై వెళ్లిన ఉద్యోగుల వివరాలను వెంటనే సమర్పించాలని, అవసరమైతే వారిని వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాలకు అందుబాటులో ఉండేలా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని నర్సరీల్లో దాదాపు 22 కోట్ల మొకలు అందుబాటులో ఉన్నాయని అధికారులు సీఎంకు నివేదించగా, వానకాలం ఆరంభంలో నాటేందుకు ఏర్పాట్లు చేయాలని, కేంద్రం నుంచి వచ్చే కాంపా నిధులను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సమీక్షలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియాల్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.