హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించేలా మార్గదర్శకాలను ప్రతిపాదించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై ఆయన గురువారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ధరణి పోర్టల్, భూ సంబంధ అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం, మంత్రులకు వివరించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. భూ సంస్కరణలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఇప్పుడు కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిషారం లభించేలా కమిటీ ప్రతిపాదనలు ఉండాలని అన్నారు. కమిటీలో మంత్రులతోపాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు సభ్యులుగా ఉండాలని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలపై సవివర నివేదిక అందజేయాలని సీఎస్ను ఆదేశించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.