హైదరాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ): రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని, ఇందుకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన రైతు రుణమాఫీ, ఇతర అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ అమలుకు ప్రణాళికలు రూపొందించాలని, రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు.
పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలను సేకరించి అర్హులను గుర్తించాలని సూచించారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్ల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను కూడా సేకరించాలని ఆదేశించారు. రుణమాఫీకి కటాఫ్ తేదీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతోపాటు అవసరమైన అంచనా వ్యయాన్ని రూపొందించాలని సూచించారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.