హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): భూమి పాసుబుక్పై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. కేవలం కుటుంబ నిర్ధారణకే రేషన్కార్డును వాడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్కార్డులు ఉండగా.. రుణాలు ఉన్న రైతు ఖాతాల సంఖ్య 70 లక్షలేనని వెల్లడించారు. రేషన్కార్డులు లేని 6.36 లక్షల మందికి రుణాలు ఉన్నాయని, వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టంచేశారు.
రేషన్కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వబోమని చెప్పారు. గురువారం ఉదయం 11 గంటలకు కలెక్టర్లు జిల్లా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. రుణమాఫీకి ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలని, వ్యక్తిగత, ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దని బ్యాంకర్లకు స్పష్టంచేయాలని సూచించారు. గతంలో కొందరు బ్యాంకర్లు అలా చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, ఇప్పుడు కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.
గురువారం సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్దకు తీసుకొనిరావాలని, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు రైతులతో ఆ సంతోషాన్ని పంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో రెండు జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతామని, కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.