మణికొండ, ఏప్రిల్ 26: హైదరాబాద్లోని ఔటర్ రింగ్రోడ్డు(ఓఆర్ఆర్) ఆదివారం నిరసనలతో హోరెత్తింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాకపోకల నేపథ్యంలో పోలీసులు గంటల తరబడి ట్రాఫిక్ను నిలిపివేయడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పుప్పాలగూడ టోల్గేట్ సమీపంలో కార్ల హారన్లను ఏకధాటిగా మోగిస్తూ సీఎం తీరుపై నిరసన తెలియజేశారు. నార్సింగి, గచ్చిబౌలి, జన్వాడ వంటి ప్రాంతాల్లోని కన్వెన్షన్ సెంటర్లలో జరిగే వివాహాది శుభకార్యాలకు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి తరచుగా ఈ మార్గం గుండా వెళ్తున్నారు.
ఆదివారం కూడా సీఎం రాక ఉందంటూ పుప్పాలగూడ టోల్గేట్ వద్ద పోలీసులు గంటకుపైగా వాహనాలను నిలిపివేశారు. దీంతో ఎండలో, అత్యవసర పనుల నిమిత్తం వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించిన వాహనదారులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువ మాట్లాడితే లోపల వేస్తాం.. అంటూ పోలీసులు బెదిరించడంతో ప్రయాణికుల సహనం నశించింది. దీంతో వందలాది వాహనదారులు తమ కార్ల హారన్లను మోగిస్తూ రోడ్డుపైనే బైఠాయించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల తీరు, ప్రభుత్వ ధోరణిపై ఓఆర్ఆర్ మార్గంలో ప్రయాణిస్తున్న జనం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.