హైదరాబాద్: మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పీ.నర్సారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంతాపం తెలిపారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రజలకు ఆయన అనేక సేవలందించారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. నర్సారెడ్డి అనుభవాలు తమకు మార్గదర్శకంగా ఉండేవని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని తెలిపారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సారెడ్డి.. సోమవారం తెల్లవారుజామున తుది శ్వాసవిడిచారు. 1931, సెప్టెంబర్ 22న నిర్మల్ పట్టణంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన ఆయన.. నిజాం నిరంకుశ పరిపాలన నుంచి హైదరాబాద్ విముక్తి కోసం పోరాడారు. మూడు పర్యాయాలు నిర్మల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక పర్యాయం శాసన మండలి సభ్యునిగా, ఆదిలాబాద్ ఎంపీగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశారు.