హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ప్రతి తండా గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ భవనాలు నిర్మించి ఏడాదిలోపే వాటిని ప్రారంభిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. బంజారాహిల్స్లోని బంజారాభవన్లో గురువారం గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ 285వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. చదువుకున్నప్పుడే సమాజంలో గౌరవం ఉంటుందని చెప్పారు. చదువే అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని అన్నారు.
సంత్ సేవాలాల్ సూచించిన సన్మార్గంలో అందరు నడవాలని సూచించారు. సేవాలాల్ జయంతి ఉత్సవాల నిర్వహణకు రూ.కోటికి అదనంగా మరో కోటి రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు. ఇందుకు తక్షణమే జీవో మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా కూడా నిర్ణయించామని చెప్పారు. కరెంటు, తాగునీరు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరిస్తామని చెప్పారు.