హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్తు ఉత్పత్తి కంపెనీలతో రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (డిసం)లు కుదుర్చుకున్న అన్ని రకాల విద్యుత్తు కొనుగోలు ఒప్పందా (పీపీఏ)లపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ ఒప్పందాల్లోని నిబంధనలు, రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) నుంచి పొందిన అనుమతులు, ఒప్పందాల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్తు ధరలు వంటి అంశాలు నివేదికలో ఉండాలని అధికారులకు సూచించారు.
అధిక ధరతో విద్యుత్తు కొనుగోలు చేసేందుకు జరిగిన ఒప్పందాలకు కారణాలను సైతం వివరించాలని ఆదేశించారు. ఇకపై బహిరంగ మారెట్లో తక్కువ ధరకు లభించే విద్యుత్తునే కొనాలని స్పష్టం చేశారు. విద్యుత్తు శాఖపై బుధవారం ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా, భవిష్యత్తు అవసరాలు తీర్చేందుకు కొత్త విద్యుత్తు కేంద్రాల నిర్మాణానికి ఉన్న అవకాశాలు, జెన్ కో ఉత్పత్తి సామర్థ్యం పెంపుదల, గృహజ్యోతి పథకం అమలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జెన్కో ఆధ్వర్యంలో విద్యుత్తు ఉత్పత్తి, ఇతర కంపెనీల నుంచి విద్యుత్తు కొనుగోళ్లు, విద్యుత్తు డిమాండ్, సరఫరా పరిస్థితులు, డిసంల ఆర్థిక పరిస్థితి, పనితీరును అధికారులు సీఎంకు వివరించారు.
రాష్ట్రానికి సమగ్ర విద్యుత్తు విధానం లేకపోవటంతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. వివిధ రాష్ట్రాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి సమగ్ర విద్యుత్తు విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. విద్యుత్తు రంగ నిపుణులతో సైతం చర్చిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన విద్యుత్తు విధానం రూపకల్పన చేస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు.
గృహజ్యోతి పథకం ద్వారా ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ రంగంలో కొత్త విద్యుత్తు కేంద్రాల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని, నిర్మాణంలో ఉన్న విద్యుత్తు కేంద్రాలను సత్వరంగా పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్తు దుర్వినియోగాన్ని అరికట్టి, నాణ్యతను పెంచాలని తెలిపారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, డీ శ్రీధర్బాబు, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.