CM Revanth Reddy | నారాయణపేట, మార్చి 14: నారాయణపేట జిల్లా మద్దూరు మండలం దోరేపల్లిలో నెలకొన్న తాగునీటి సమస్యను గురువారం అధికారులు పరిష్కరించారు. గ్రామంలో మొత్తం 526 మంచినీటి నల్లా కనెక్షన్లు ఉన్నాయి. పూర్తిస్థాయిలో నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస్థులు బుధవారం మద్దూరు-కోస్గి రోడ్డుపై ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ‘సీఎం రేవంత్రెడ్డి ఇలాకాలో తాగునీటికి కటకట’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో గురువారం ఫొటోవార్త ప్రచురితమైంది. ఈ మేరకు మిషన్భగీరథ ఈఈ రంగారావు, ఏఈ చెన్నయ్య, పంచాయతీ సెక్రటరీ రాజయ్యగౌడ్ స్పందించారు. హుటాహుటిన గ్రా మానికి చేరుకొని 25 మీటర్ల కొత్త బైపాస్ పైప్లైన్ను ఏర్పాటు చేయించారు. పనులు పూర్తి చేసి మంచినీటిని వదిలారు.
అంతేకాకుండా నల్లాలకు ఎవరూ హాఫ్ హెచ్పీ మోటర్లు పెట్టకుండా పర్యవేక్షించారు. కోయిల్కొండ నుంచి వచ్చే పైప్లైన్కు మూడ్రోజుల కిందట మరమ్మతు చేయడం జరిగిందని మిషన్భగీరథ ఏఈ చెన్నయ్య తెలిపారు. గ్రామంలో చాలామంది నల్లాలకు మోటర్లు పెట్టడంతో ప్రెషర్ తగ్గి ఎత్తు ప్రాంతంలో ఉన్న ఇండ్లకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదని, ఈ సమస్య పరిష్కారం కోసం బైపాస్ పైప్లైన్ ఏర్పాటు చేసి నీటిని వదిలామని వివరించారు. నీటి సమస్య తీరడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.