CM Revant Reddy | తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (టీ-నాబ్)ను ఆదర్శంగా తీర్చి దిద్దాలని అన్నారు. శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకంపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు మరింత చురుగ్గా పని చేయాలన్నారు.
అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టి, గంజాయి, డ్రగ్స్ సరఫరా చైన్ ను బ్రేక్ చేయాలని, వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా, ఎంత పెద్దవారు ఉన్నా ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు.
అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎఫెక్టివ్ గా పని చేసేవారిని ప్రోత్సహించాలని సూచించారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు అవసరమైన వనరుల కల్పనకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుందని, డ్రగ్స్ పదం వింటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలన్నారు.