హైదరాబాద్ : సాహితీ సృజనకారుల ఆత్మబంధువు, సాహితీవేత్త, నిజాం వెంకటేశం మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పేదరికంలో వున్న తెలంగాణ రచయితలు, కవుల బాగోగులను కనిపెట్టుకుంటూ, వారికి చేదోడువాదోడుగా వుంటూ, తెలంగాణ సాహిత్యం పట్ల వెంకటేశం కనబరిచిన ఆత్మీయతానుబంధం గొప్పదని కేసీఆర్ కొనియాడారు. వెంకటేశం మరణం సాహిత్య రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. వెంకటేశం కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
నిజాం వెంకటేశం గుండెపోటుతో ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ అపోలో దవాఖానలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. సుమారు 6 దశాబ్దాలుగా సాహిత్యంలోనే జీవిస్తూ, అదే శ్వాసిస్తూ అనేక ప్రముఖ గ్రంథాలను ప్రచురించారు. 80వ దశకంలో ‘దిక్సూచి’ అనే కవితా పత్రికను ప్రారంభించి ఎంతోమంది కొత్త, పాత కవులకు వేదికగా నిలిచారు. పుస్తకాన్ని అమితంగా ప్రేమించే ఆయన ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పనిచేస్తూనే ప్రతినిత్యం గ్రంథాలను అన్వేషించేవారు. తనకు సాధ్యమైనంత వరకు కవులు, రచయితలకు చేదోడువాదోడుగా నిలిచేవారు.