Salary Hike | హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో అరకొర జీతాలతో అష్టకష్టాలు పడ్డ చిరుద్యోగుల జీవితాల్లో స్వరాష్ట్రంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. తెలంగాణ ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకుని ఆదరించింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఆలోచించి వేతనాలను గణనీయంగా పెంచింది. దీంతో పలు ప్రభుత్వశాఖల్లోని చిరుద్యోగులు ధీమాగా బతుకుతున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరికీ న్యాయం చేసింది. ఇటీవల సఫాయి కార్మికుల వేతనాన్ని రూ.1,000 పెంచింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. వీఆర్ఏలకు పేస్కేల్ అమలుచేసింది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ బోధన సిబ్బందికి గత ప్రభుత్వాలు కేవలం 10 నెలల వేతనాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 12 నెలల పూర్తి వేతనాన్ని మంజూరుచేస్తున్నది. కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి, శిశుసంరక్షణ సెలవులను మంజూరుచేసింది.
అందరికీ ఒకేసారి పీఆర్సీ
ఉమ్మడి రాష్ట్రంలో పీఆర్సీలు, ఐఆర్లు కేవ లం ప్రభుత్వ ఉద్యోగులకే పెంచేవారు. కొంతకాలానికి ఆలస్యంగా ఆయా పీఆర్సీ ప్రకారం ఇతరశాఖల్లోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలను పెంచేవారు. దీంతో చిరుద్యోగులు నష్టపోయేవారు. ఈ ధోరణిని తెలంగాణ ప్రభుత్వం సమూలంగా మార్చింది. 2020లో పీఆర్సీని ప్రకటించిన సమయంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచింది. ఇదో విప్లవాత్మక నిర్ణయం. ఇప్పుడు పీఆర్సీ ప్రకటన వస్తుందంటే ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు సైతం ఆశగా చూస్తున్నారు. తమకు న్యాయం జరుగుతుందన్న భరోసాతో జీవిస్తున్నారు.
గతంలో ఉద్యోగుల వేతనాలు, ఇప్పటి వేతనాలు (రూపాయల్లో..) ఇలా..