పెద్దపల్లి : తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం రామగుండం చైతన్యపురి కాలనీలో సింగరేణి కోల్ లారీ లోడింగ్, అన్లోడింగ్ ,లెవెలింగ్,తర్ఫాలీన్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసిన వీటీసీ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. ఇంటి స్థలం ఉన్న వారికి ప్రభుత్వం రూ. మూడు లక్షలను విడతల వారీగా ఇంటి నిర్మాణానికి అందించనున్నదని తెలిపారు. కార్మికులకు బీమా వర్తించేవిధంగా కృషి చేస్తానని అన్నారు.
అనంతరం అంగన్వాడీ సెంటర్ ను ఎమ్మెల్యే సందర్శించి పిల్లలకు విద్య బోధన ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు నీలం పద్మ గణేశ్, బాలరాజకుమార్, పాముకుంట్ల భాస్కర్, యూనియన్ నాయకులు మధు, నర్సయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.