జగిత్యాల : చేనేత రంగానికి సీఎం కేసీఆర్ చేయూతనిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణంలో చేనేత సహకార సంఘం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సిరిసిల్ల ఉరిసిల్లగా మారిన సందర్భంలో..సీఎం కేసీఆర్ వారికి అండగా నిలిచారన్నారు. నేతన్నలకు అవసరమైన కరెంట్, కలర్లపై సబ్సిడీలు, మార్కెటింగ్ పై అవగాహన కల్పించి ఆదుకున్నారన్నారు.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గతంలో ఉన్న పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు పద్మశాలీలు గమనించాలన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపాధి లేక నేతన్నలు ఆకలి చావులకు గురయ్యారు. 2002లో ఉద్యమ నేతగా కేసీఆర్ సిరిసిల్లలో మీటింగ్ ఏర్పాటు చేసి రూ.50 లక్షల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు.
నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేతన్నలకు చేనేత బంధు పథకం ప్రకటించి మరణిస్తే ఇన్సూరెన్స్ ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేయడం గొప్ప విషయం అన్నారు.
చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను సన్మానించారు. పలు పాఠశాలలో చేనేత పై నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డా.సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, సుంకె రవి శంకర్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, జిల్లా కలెక్టర్ జి.రవి, జిల్లా, పట్టణ పద్మశాలి అధ్యక్షులు రుద్ర శ్రీను, గౌరీ శ్రీనివాస్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.