మెదక్ : రాష్ట్రంలో అన్ని కులాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్సీ శేరీ సుభాశ్రెడ్డి తెలిపారు. గురువారం మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం కూచన్పల్లి శివారు చెక్డ్యామ్ లో చేప పిల్లలను నీటిలో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉపాధి అవకాశాలు లేక కుంటుపడిన కులవృత్తులకు జీవం పోసి వారి వారి కులవృత్తులను కాపాడే విధంగా సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు.
చెక్ డ్యాంల నిర్మాణం వల్ల భూగర్భజలాలు పెరిగి రైతులతో పాటు మత్స్యకారులను జీవనోపాధి లభిస్తుందన్నారు. గతంలో చేపలను దిగుమతి చేసుకునే వారమని నేడు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మత్స్యశాఖ ఏడీఏ రజిని, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.